అమెరికాలో చదువుకుంటున్న తెలుగు విద్యార్ధిని ప్రియాంక గోగినేని ప్రమాదవశాత్తు మరణించింది. సియాటెల్ లోని సెయింట్ మాట్రిన్ యూనివర్సిటీలో ప్రియాంక.. స్థానిక హిక్ లేక్‌లో ఈతకు వెళ్లింది. అయితే అక్కడే ప్రమాదవశాత్తు ఆమె ప్రాణాలు కోల్పోయింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి చెందిన గోగినేని వెంకటేశ్వర్లు, సత్యవతి దంపతుల పెద్ద కుమార్తె ప్రియాంక. ఈమెకు ఒక తమ్ముడు ఉన్నాడు. వీళ్ల స్వస్థలం ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చేమెడితిపాడు. కానీ చాలా ఏళ్ల క్రితమే కావలిలో స్థిరపడ్డారు. వెంకటేశ్వర్లు కావలిలో కాంట్రాక్టర్‌గా ఉన్నారు. ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లిన కుమార్తె ఇలా అకాల మరణం పాలవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.

ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని భారతదేశానికి తరలించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఏర్పాట్లు చేస్తోంది. అమెరికాలో చదువుకునేందుకు వచ్చిన ప్రియాంక ఇలా ఆకస్మాత్తుగా మరణించిన వార్త తెలుసుకున్న అక్కడ ఆమె స్నేహితురాలు మణి పోతేపల్లి నాట్స్ హెల్ప్ లైన్‌కు ఫోన్ చేశారు.

ప్రియాంక మృతదేహాన్ని ఇండియాలోని ఆమె తల్లిదండ్రులకు పంపించేందుకు సహకరించాలని కోరారు. దాంతో నాట్స్ సంస్థ ప్రియాంక మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించేందుకు రంగంలోకి దిగింది. దీని కోసం స్థానిక పోలీసు అధికారులతో చర్చలు జరుపుతోంది. మరోవైపు ఇండియాలోని ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించి వారితో కూడా మాట్లాడుతోంది. వీలైనంత త్వరగా ప్రియాంక మృతదేహాన్ని భారత దేశానికి పంపించేందుకు అన్ని రకాలుగా కృషిచేస్తోంది.

No comments:

Post a Comment