సిద్దేశ్ అనే కన్నడ కుర్రాడు ఓ రోజు రైల్వే ట్రాక్ దాటుకుంటూ వెళుతున్నాడు. ఆ సమయంలో రైలు పట్టాలు ఊడిన దృశ్యాన్ని గమనించాడు. పట్టాలు ఊడిన విషయాన్న తన తండ్రికి చెప్పి, తండ్రితో పాటు కొంతమంది స్థానికులను కూడా అక్కడికి తీసుకొచ్చాడు. వాళ్లంతా ట్రాక్‌ను పరిశీలిస్తుండగా అదే సమయంలో ఆ ట్రాక్ పై భారీ శబ్దం చేసుకుంటూ హరిహర- చిత్రాంగద ప్యాసింజర్ రైలు దూసుకొస్తోంది. ఎవరిదగ్గరైనా ఎరుపు వస్త్రం ఉంటే ఈ ప్రమాదాన్ని ఆపవచ్చని అక్కడున్న ఓ వ్యక్తి అన్నాడు. ఆ మాటలు విన్న సిద్దేశ్ ట్రైన్‌కు ఎదురుగా పరుగెత్తాడు. ఎందుకంటే తాను వేసుకున్న చొక్కా ఎరుపు రంగుదే కాబట్టి. వెంటనే చొక్కా విప్పేసి, దాన్ని ఊపుకుంటూ రైలు ఎదురుగా పరుగుతీశాడు. సిద్దేశ్ వెనుక అతడి తండ్రి, ఊరి ప్రజలు కూడా కదిలారు. సిద్దేశ్ ఊపుతున్న ఎర్ర చొక్కాను గమనించిన ట్రెయిన్ లోకోపైలట్ వెంటనే బ్రేక్ వేసి, రైలును ఆపాడు. ఆ రైలులో 850 మంది ప్రయాణికులు ఉన్నారు. జరిగిన విషయం తెలిసి ప్రయాణికులందరూ సిద్దేశ్‌కు దండం పెట్టి, అభినందించారు. తమ ప్రాణాలు కాపాడినందుకు సిద్దేశ్‌ను పలువురు ప్రశంసలతో ముంచెత్తారు.

ట్రెయిన్‌కు ఎదురుగా పరిగెడితే తన ప్రాణానికే ప్రమాదం అన్న భయాన్ని కూడా మర్చిపోయి.. సాటివారి ప్రాణాలు కాపాడిన సిద్దేశ్‌కు ఈ నెల 14 కర్ణాటక ప్రభుత్వం ధైర్యశాలి అవార్డును ప్రదానం చేసింది. అవార్డు అందుకున్న సమయంలో సిద్దేశ్ చెప్పిన మాటలు వింటే నిజంగా చప్పట్లు కొట్టకుండా ఉండలేం. పదేళ్లు కూడా నిండని మన సాహస బాలుడు ఏమి చెప్పాడంటే.. ‘‘ప్రమాదాన్ని ఎలాగైనా ఆపి, ప్రయాణికుల్ని కాపాడాలని నా మనసులో గట్టిగా అనుకున్నా. అందుకే ఆ సమయంలో నాకు భయం వేయలేదు.” అని అన్నాడు. పదేళ్లకే ఇంతటి ధైర్యాన్ని కలిగిన ఈ కుర్రాడిని ఎవరూ మెచ్చుకోకుండా ఉండలేరు. 


"మానవ సేవే - మాధవ సేవా "

No comments:

Post a Comment