‘ఇటీవల లుకేమియా వ్యాధితో బాధపడుతూ చనిపోయిన చిన్నారి శివశ్రీ నా కుమార్తె కాదు.. అలాగే ఆమె తల్లి వెంకటేశ్వరమ్మ అలియాస్ సుమశ్రీ నా భార్య కాదు. ఆ అమ్మాయి అనారోగ్యంతో చనిపోలేదు.. సుమశ్రీతోపాటు మరికొంతమంది కలిసి చంపేశారు’ అని మాదంశెట్టి శివకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల ‘నాన్న బతికించు’ అంటూ సోషల్ మీడియాలో వీడియో ఆప్లోడ్ చేసిన కొద్ది రోజులకే శివశ్రీ మరణించిన విషయం ఇటు విజయవాడలోనూ, రాష్ట్ర వ్యాప్తంగానూ కలకలం రేపిన విషయం తెలిసిందే.
ఆ సమయంలో తన కుమార్తె శివశ్రీ వైద్యం అందకపోవడం వల్లే చనిపోయిందని, దానికి తన భర్త మాదంశెట్టి శివకుమారే కారణమని సుమశ్రీ ఆరోపించింది. ఈ క్రమంలో దీనిపై స్పందించిన శివకుమార్ ఆదివారం సుదీర్ఘ ప్రకటనను పత్రికలకు విడుదల చేశారు. శివశ్రీని ఆమె తల్లి సుమశ్రీ సహా మరికొందరు హత్య చేశారని, ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఆయన తెలిపారు. దీనిపై ఇప్పటికే మానహక్కుల కమిషన్ను ఆశ్రయించానని, త్వరలో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తానని శివకుమార్ తెలిపారు. దుర్గాపురంలోని తన ఫ్లాట్లో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయని, దీనిపై చుట్టుపక్కల వారు కంట్రోల్ రూమ్కు పలుమార్లు ఫిర్యాదు చేశారని చెప్పారు. ప్రస్తుతం సుమశ్రీతో ఉంటున్న పోలిన కృష్ణకుమార్కు ఆమె మూడో భార్య అని అన్నారు.
అమ్మాయిలను అక్రమంగా తరలిస్తూ పోలీసులకు చిక్కి చంచల్గూడ జైలులో శిక్ష అనుభవించి బయటకు వచ్చిన ఓ మహిళ ఆధ్వర్యంలో దుర్గాపురంలోని తన ఫ్లాట్లో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయన్నారు. విజయవాడలో చిన్నారి శివశ్రీతో కలిసి సుమశ్రీ కొంతకాలం క్రితం తన ఫ్లాట్లో అద్దెకు దిగిందని, ఆ తర్వాత రూ.8లక్షల బంగారు ఆభరణాలను దొంగిలించి హైదరాబాద్లోని కృష్ణకుమార్ వద్దకు వెళ్లిపోయిందని ఆరోపించారు. దీనిపై ఆనాడు పామర్రు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశానన్నారు. కేవలం మానవతాదృక్పథంతోనే పాపను పెంచానని, శివశ్రీ వైద్యానికి సుమారుగా రూ.25లక్షల ఖర్చు చేశానని, వారితో తనకే సంబంధం లేదని చెప్పారు.
No comments:
Post a Comment